Magha Masa Gauri Vratham (Telugu)

Magha Masa Gauri Vratham Mahatmyam in Telugu.. Importance or significance of Magha Masa Gauri Vratham in Telugu..

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం

మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.

ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.

పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.

ఇలా మాఘ పురాణంలోని మూడో అధ్యాయంలో ఉన్న ఈ కథ గౌరీ కథ మహాత్మ్యంతోపాటు మాఘస్నాన పుణ్య ఫలితాలను వివరిస్తోంది. ఈ వివరణ వెనుక ఒక జన్మలో చేసిన తప్పుల పాప ఫలితాన్ని మరుసటి జన్మకు కూడా అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని కనుక పాపాలు చేయవద్దనే సున్నితమైన హెచ్చరిక ఒదిగి ఉంది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading