Kartika Purana 16th Chapter in Telugu explains the importance of Sthambha Deepa (Deepa Sthambham).. It is recited on 16th day of Karthika Masam..
స్తంభ దీప ప్రశంస
వశిష్టుడు చెబుతున్నాడు.
“ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట, చాలా ముఖ్యము. ఎవరు కార్తీకమాసమందు తమకు శక్తివున్నా దానము చేయరో, అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెలదినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆవిధముగానే నెలరోజులలో ఏ ఒక్కరోజులలో ఏ ఒక్కరోజూ విడువకూండ, తులసి కోటవద్దగాని – భగవంతుని సన్నిధినిగాని దీపారాధన చేసినయడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠప్రాప్తి కలుగును. కార్తీకశుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి, భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు,నారికేళ ఫలదానము జేసిన యెడల – చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్ర సంతానము కలుగును.
సంతానము వున్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజ స్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీకమాసమంతయు ఆకాశ దీపము గాని, స్తంభ దీపము గాని వుంచి నమస్క్రరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యం గాని, నువ్వులుగాని ప్రమిద అడుగునపోసి దీప ముంచవలయును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారును, లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచుజన్మ మెత్తుదురు. ఇందులకొక కథ కలదు. చెప్పెదను వినుము.
దీపస్తంభము విప్రుడగుట :
ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని, దానికి దగ్గరలో నొక మందిరాన్ని కూడా నిర్మించుకొని, నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టుప్రక్కల మునులుకూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయద్వారాలపై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండెడివారు ఒకనాడు ఆ మునులలోఒకవృద్ధుడు తక్కిన మునులను జూచి “ఓ సిద్ధులారా! కార్తీకమాసములో హరిహరాదులు ప్రీతికొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తికలుగుతుందని మనకందరుకూ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధపౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికెదురుగా ఒక స్తంభము పాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుపాటి స్తంభము తోడ్కొనివత్తము, రండు” అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికివెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామి కెదురుగా పాతిరి.దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందువత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపఠనము చేయుచుండగా ఫెళఫెళమను శబ్దము వినిపిం చి,అటుచూడగావారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూచి వారందరు ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభమునుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని జూచి “ఓయీ నీవెవడవు? నీవీ స్తంభమునుండి యెలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి?” అని ప్రశ్నించిరి. అంత, ఆ పురుషుడు వారందరకు నమస్కరించి ” పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను. ఒక జమీందారుడను. నాపేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధు లలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజించక, దానధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయమున నే విప్రుడయినా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్లు కడిగించి, ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను వున్నతాసనముపై కూర్చుండి అతిధులను నేలపై కూర్చుండుడని చెప్పెడివాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను. అందరును నా చేష్టలకు భయపడువారేకాని, నన్నెవరును మందలింప లేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దులేకపోయెడిది. దానధర్మములు యెట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోరనరకములు అనుభవించి, లక్షజన్మలయందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదువేల జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను జేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకర్మలన్నియు మీకు తెలియచేసితిని. నన్ను మన్నింపు” డని వేడుకొనెను.
ఆ మాటలాలకించిన, మునులందరు నమితాశ్చర్య మొంది “ఆహా! కార్తీకమాస మహిమ మెంత గొప్పది. ఆదియునుగాక, కార్తీకశుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కఱ్ఱలు, రాళ్లు, స్తంభములుకూడా మనకండ్ల యెదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధపౌర్ణమి ఆకాశదీప ముంచిన మనుజునకు వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే యీ స్తంభమునకు ముక్తికలిగినదని మునులు అనుకొనుచుండగా, ఆ పురుషడామాట లాలకించి “మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును? అది నశించుటెట్లు? నాయీసంశయము బాపు”డని ప్రార్ధించెను. అక్కడవున్న మనీశ్వరులందరును తమలో నొకడగు అంగీరస మునితో “స్వామీ! మీరే అతని సంశయమును తీర్చగల సమర్ధులు గాన, వివరించు” డని కోరిరి. అంతనాంగీరసుడిట్లు చెప్పుచున్నాడు.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి షోడశాధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తము.