Kartika Purana 28th Chapter in Telugu explains the significance of Sudarshana Chakra of Lord Vishnu. It is recited on 28th day of Karthika Masam.
కార్తీక పురాణము 28వ అధ్యాయము
విష్ణు సుదర్శన చక్ర మహిమ
జనక మహారాజా! వింటివా దూర్వాసుని అవస్థలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుకముందు లాలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను.
అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి “అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో, ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వానించితివి, కాని నిన్ను కష్టముల పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితిని. గాని, నా దుర్భుద్ధి నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి యావిష్ణు చక్రము వలన ఆపదనుండి రక్షింపుమని ప్రార్ధించితిని. ఆపురాణ పురుషుడు నాకు జ్ఞానోదయముచేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడ నైనను నీ నిష్కళంక భక్తిముందవి యేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు” మని అనేక విధాల ప్రార్ధించగా, అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, “ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మనఃపూర్వక వందనములు.ఈ దూర్వాసమహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యూతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు. ఒకవేళ నీకర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్ను చంపి, తర్వాత ఈ దూర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరిని చేతిలోనుండి అనేక యుద్ధములలో, అనేకమంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరు వారిని యింతవరకు చంపలేదు. అందువలననే యీ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుట లేదు. దేవా! సురాసురాది భూత కోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు. నీశక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్ధించుచున్నాను.
నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. నిన్ను వేడుకొను చున్ననన్నును, శరణు వేడిన యీ దూర్వాసుని రక్షింపుము” అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్ధనలకు శాంతించి “ఓ భక్తాగ్రేశ్వరా! అంబరీషా! నీభక్తిని పరీక్షించుటకిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను – దేవతలందరు యేకమైకూడ – చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈలోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీమీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.
ఈతడు కూడా సామాన్యుడుగాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నాకంటె యెక్కువేమియుగాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెను, కైలాస పతియగు మహేశ్వరుని తేజశ్శక్తికంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడుగాని, క్షత్రియ తేజస్సుగల నీవుగాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటివాడు బలవంతుడై యునప్పుడు అతనితో సంధిచేసుకొనుట యుత్తమము. ఈనీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తులనుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్ధియై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు” మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, “నేను దేవ, గో, బ్రాహ్మణాదుల యందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నారాజ్యములో సర్వజనులూ సుఖముగా నుండవలెననియే నా యభిలాష. కాన,శరణుగోరిన ఈ దూర్వాసునీ, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్లకొలది సూర్యమండలములు యేకమైననూ నీ శక్తికీ, తేజస్సుకూ సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై , లోకకంటకులపై , దేవ – గో – బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షి యుందున్న పధ్నాలుగు లోకములను కంటికిరెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నీకివే నామనఃపూర్వక నమస్కృతులు.” అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాధాలింగన మొనర్చి ” అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణుస్తోత్రము మూడుకాలముల యందు నెవరు పఠింతురో, యెవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, యెవరు పరులను హింసించక – పరధనములను ఆశపడక – పరస్త్రీలను చెరబెట్టక – గోహత్య – బ్రాహ్మణహత్య – శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసౌఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రతప్రభావము చాలా గొప్పది. నీపుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు.” అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.
ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి అష్టావింశోధ్యాయము ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.